జ్ఞానేశ్వరి అదృశ్యం: చిన్నారిని సురక్షితంగా అప్పగిస్తే కేసులు ఉండవు – పోలీసులు
తుని: కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు దాటినా, ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ తిలక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్నారి ఎవరైనా తెలియక తీసుకెళ్లి ఉంటే, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని, ఎలాంటి ఇబ్బందులు కలిగించమని ఆయన స్పష్టం చేశారు. పాపను సురక్షితంగా పోలీసులకు అప్పగించాలని కోరారు. దర్యాప్తులో భాగంగా సంచార జాతులు, అటవీ ప్రాంతాల్లోని వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించామని, అలాగే జంతువుల కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
జూన్ 6న జ్ఞానేశ్వరి అదృశ్యం తర్వాత పోలీసులు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ మరియు సాంకేతిక ఆధారాలతో నిరంతరం గాలిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఏ చిన్న సమాచారం తెలిసినా పోలీసులకు వెంటనే తెలియజేయాలని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.